హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వస్తే అటు నగరవాసులతో పాటు ఇటు నగర శివారు ప్రాంతాల వారికి కూడా చాలా మేలు జరిగే అకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
ORR-Outer RIng Rail
ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వస్తే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు వస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు నగరం నలువైపులా సుమారు వంద కిలోమీటర్ల మేర విస్తరించింది. నగరానికి మెట్రో వచ్చాక ప్రజా రవాణా తీరే మారిపోయింది. ఇక హైదరాబాద్ విశ్వనగరంగా మారటాన్ని ఎవ్వరూ ఆపలేరు.
5 నుంచి 10 నిమిషాలకు ఒక రైలు
తాజాగా హైదరాబాద్లో సుమారు 26 వేల కోట్లతో ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించటం విశేషం. ఈ ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు గనక అందుబాటులోకి వస్తే నగరంలోకి దూర ప్రాంత రైళ్ల రాక తగ్గి ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు ఊపందుకుంటాయని నిపుణులు చెప్తున్నారు. 5 నుంచి 10 నిమిషాలకు ఒక రైలు పట్టాల మీద పరుగులు పెట్టే అవకాశముంటుందని చెప్తున్నారు.
ఇటు వరంగల్ హైవే… అటు మేడ్చల్ హైవే
ఇప్పటికే నగరంలో 95 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు 2024 జనవరికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. కొత్తగా వస్తున్న ఔటర్ రింగు రైలు ప్రాజెక్టుతో ఎంఎంటీఎస్ రెండో దశ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇది జరిగితే అటు వరంగల్ హైవేలో ఘట్కేసర్ తర్వాత యాదాద్రి, జనగామ ఇటు మేడ్చల్ హైవేలో మనోహరాబాద్, తూప్రాన్ వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రజల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు అందుబాటులోకి రాగానే, ఈ విస్తరణ కూడా జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
అన్ని రూట్లను అనుసంధానం
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అన్ని రూట్లను అనుసంధానం చేస్తూ అన్ని చోట్ల జంక్షన్లు నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. ఇలా చేయటం వల్ల దూర ప్రాంతాల రైళ్లు నగరంలోకి రాకుండా శివార్లలో ఆగి అటు నుంచి అటే వెళ్లిపోతాయి. దీంతో నగరంలోని స్టేషన్లు, రైల్వే లైన్లు ఫ్రీ అవుతాయి అనేది విశ్లేషకుల అంచనా.
Source: https://telugu.samayam.com/telangana/hyderabad/if-outer-ring-rail-project-come-to-hyderabad-here-are-the-benefits/articleshow/101399122.cms